Monday, July 11, 2016

భారతీయ భాషలపట్ల ఇంత దురహంకారమా? శాస్త్రీయత కొరవడిన ఇంగ్లీషు మాధ్యమ ఉద్యమం

మానవులు విశ్వాంతరాళాలమధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ ఆధునిక యుగంలో కూడా కొన్ని స్వార్థ శక్తులు తమ అధికారాన్నీ ఆధిపత్యాన్నీ కండబలంతోనేగాక బుద్ధిబలంతోకూడా సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి కొందరి బుద్ధిబలానికి    బలహీనులు   మానసిక దోపిడీకి లొంగిపోతారు. ఈ మానసిక దోపిడీ భావదాస్యానికి దారితీస్తుంది. ఈ పరంపరలో భాష ఒక ముఖ్య సాధనం అవుతుంది. ఒకప్పుడు సంస్కృత గుత్తాధిపత్యం నుంచి బైటపడడానికి తెలుగూ తదితర దేశభాషలకు వేయి సంవత్సరాలకు పైగా పట్టింది. యుగం మారినా మళ్లీ అదే బాటా- ఈ మారు సంస్కృతం బదులు ఇంగ్లీషు దాస్యం   ప్రాథమికవిద్య దశలోనే మాతృభాషలకు బదులు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అనాగరికం. పసివయసులో ఇంగ్లీషును రుద్దడమంటే బలవంతాన భావదాస్యంలోకి తోసివేసినట్లే.    దూరదృష్టి లోపించిన స్వార్థపరులైన  కొందరు ఉద్యోగాలను ఎరచూపి ఇంగ్లీషును ఇట్లా  ప్రోత్సహించడం బలహీనులపై చేస్తున్న  మానసిక దాడిగా దీనిని  గుర్తించాలి. ఇంగ్లీషు మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలూ బతుకుదెరువూ అని నమ్మించడం అమానుషం. ఈ  ఇంగ్లీషుతోనే మనం పేదరికంనుండి గట్టెక్కుతామనడం ఒక బానిస భావన. ఈ భావన మన సమాజానికి  ఎక్కుతున్న విష సంస్కృతి ప్రభావమే. 

నేటి ప్రపంచంలో షుమారు వందకుపైగా దేశాలు  మన   తెలుగు రాష్ట్రాలకంటే విస్తీర్ణంలో చిన్నవి. ఇక జనాభాలో ఇరవై దేశాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల కన్నా ఎక్కువలో ఉన్నాయి. ఈ విస్తృతినీ ఈ ఆధిక్యాన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి.    ఎంతో విస్తీర్ణమూ అధిక జనాభా, వివిధ భాషలూ, పలు సంస్కృతులూ కలిగిన మన రాష్ట్రాలనూ దేశాన్నీ కొన్ని దేశాల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ నేషన్స్)గా చూడాలిగానీ పాలనాపరమైన ఏవో కొన్ని అవసరాలకోసం విభజింపబడ్డ  రెవెన్యూ భాగాల సముదాయంగా కాదు. ఇండియాని కొన్ని దేశాలూ జాతుల సమాఖ్యగా చూడలేనివారి ఆలోచనా విధానం అశాస్త్రీయం. ఇట్లాంటి పంథాలోనించి వచ్చిన ఆలోచనలే తెలుగును వదిలి ఇంగ్లీషు భాషను మాత్రమే నేర్చుకోవాలనీ, దీనితో మున్ముందు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలాంటి దేశాలను మన వలస దేశాలుగా మలచుకోవచ్చనే ఆలోచనలు ఎంత అసంబద్ధమైనవో పునరాలోచించాలి.

ఇంగ్లీషును భారతదేశ ప్రజలపై రుద్దడానికి చేసే దూరదృష్టిలేని  దురాలోచనలకు ఆధారాలుగా వలసవాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎంత దుర్మార్గమైన ఆలోచనో పరిశీలించండి. ఇట్లాంటి ఆలోచనలతోటే వలసవాదులు   వందల ఏండ్లకిందటే అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల ఆదివాసులపై అమలుజరిపిన పైశాచిక దాడులూదారుణ మారణకాండలూ జాతులకు జాతులనే తుడిచిపెట్టిన వైనాన్ని మనం మరిచిపోలేదు. ఇట్లాంటి యూరోపియన్ల పైశాచిక ప్రవర్తనలను  ప్రశంసించవలసిన అవసరం లేదు.  యూరోపియన్ల వలసలకు కారణాలను హేతుబద్ధ తార్కిక పద్ధతిలో ఆలోచించాలి.   యూరోపియన్ల వలసలకు ప్రధాన కారణం వారి స్వదేశ వాతావరణం.  ప్రపంచంలో బొగ్గు, చమురు, గ్యాసు, విద్యుత్తును కనుక్కోక ముందు   యూరోపు దేశాలలో బ్రతకడం మహా దుర్భరంగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే   ఒకప్పుడది శాపగ్రస్తుల ప్రవాసస్థానం. సేద్యానికి అనువైన భూమీ, నీరూ, చాలినంత  సూర్యరస్మి   లాంటి వనరులు తక్కువ. సగటున నాలుగు-ఐదు నెలలూ రోజుకు 7-8 గంటలు  మాత్రమే   ఉండే సూర్యరస్మిలో తక్కువ వనరులతో పండే చాలీచాలని పంటలూ, మిగిలిన ఏడెనిమిది నెలలు మాంసాహారంపై ఆధారపడే జీవనం.  ఆ మాంసాన్ని నిలవచేసుకొనేందుకు  తూర్పు దేశాలలో దొరికే సుగంధద్రవ్యాలూ మసాలాదినుసుల వ్యాపారం అవసరం అయింది. వ్యాపారులుగా బయలుదేరినవారు తర్వాత వలసదారులుగా అవతారమెత్తారు. ఐరోపా వలసదారులు కొన్నిసార్లు స్థానికులపై హింసాత్మక చర్యలకు దిగడం, ఆ దేశాల సంపదను దోచుకోవడం, వారి భూభాగాలను ఆక్రమించుకోవడం అడ్డమొస్తే అంతం చేసేందుకు కూడగట్టుకున్న సాయుధ సిబ్బందితో కదిలేవారు. ఐతే క్రమేణా  ప్రాకృతిక ఇంధనాలైన బొగ్గూ, పెట్రోలునూ    కనిపెట్టడం దానితోపాటే పారిశ్రామికీకరణం కొత్త ఉత్పత్తుల తయారీ వాటి అమ్మకాలకోసం తూర్పు దేశాల అన్వేషణలో వలసవాదానికి ఓ ప్రత్యేక స్థితిని తీసుకువచ్చింది. అంటే కనీస అవసరాలతో మొదలైన యూరోపియన్ల వలసలు వ్యాపార-వాణిజ్యాల ముసుగు వేసుకొని   వలస దేశాల రాజకీయ అస్థిత్వానికి చేటుతెచ్చేంతవరకూ వెళ్లింది.  సముద్ర యానం భారతీయులకు కొత్తేమీ కాదు. రెండువేల యేళ్లనాడే వేలాది కిలోమీటర్ల మేర విస్తరించిన ఆగ్నేయ ఆసియా దేశాల మొత్తంపై తమ ప్రాభవ ముద్రవేయగలిగారు. కానీ ఎక్కడా స్థానిక జాతుల్ని తుడిచిపెట్టిన దాఖలాలు లేవు. భారతీయ సంస్కృతీ, భాషల ఆనవాళ్ళూ అంతటా కనిపిస్తాయి.

తూర్పు దేశాలు, ప్రత్యేకంగా భారత ఉపఖండం సహజ సిద్ధ వనరులతో  సంవత్సరం పొడవునా సేద్యానికి అనువైన భూమీ, తగినంత నీరూ, కావలసినంత  సూర్యరస్మి  మొదలైన  వనరులు ఎక్కువగా కలిగివుండేవి. గుప్పెడు గింజలు చల్లితే గంపెడంతమంది తినేంత పంట దిగుబడి అయ్యే దేశం ఇది.

మన దేశంకన్నా రెండు మూడింతలు పెద్దవైన అమెరికా, ఆస్ట్రేలియా,  కెనడా   దేశాలకు వలస పోయేందుకు పనికివస్తుందని మనం మన భాషలను వదిలి ఇంగ్లీషును మాధ్యమంగా ఎంచుకోవాలనడం దారుణం. మన దేశంలో జనాభా సాంద్రత ఎక్కువే. దానిని ఎప్పటికైనా నియంత్రించక తప్పదు. నేడు వనరులు తక్కువగా ఉన్నాయని చెప్పి  మన దేశభాషలను వదులుకొని ఇంగ్లీషును మాధ్యమంగా ఎంచుకోవాలనడం సమంజసం కానేకాదు.

ప్రపంచ దేశాలలో అందుబాటులోవున్న భూమీ మంచినీటి వనరుల నిష్పత్తిలో భారతదేశానిదే పైచేయి. ఉదా. ఐరాస విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ పెద్ద దేశాల  భూవైశాల్యంలో నీటివనరుల  సగటు శాతం వరుసగా ఇట్లా ఉంది:  1. ఇండియా  9.55%, 2. కెనడా  8.93%, 3. అమెరికా సం.రా.   5.3%, 4. ఇండోనేశియా   4.88%, 5. రష్యా   4.21%, 6. కాంగో(డె.రి.)  3.32%, 7. అర్జెంటీనా   1.57%, 8. చైనా   1.41%, 9. మెక్సికో    1.04%, 10. కజఖస్తాన్  0.92%, 11. ఆస్ట్రేలియా   0.76%, 12. బ్రెజిల్   0.65%, 13.  సౌదీ అరేబియా 0.0%. ఇక, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ లెక్కల  ప్రకారం వివిధ అగ్రరాజ్యాల భూవైశాల్యంలో సాగుభూమి   సగటు విస్తీర్ణంలో ఇండియాదే అగ్రస్థానం: ఉదా. ఇండియా 52.8%, అమెరికా సం.రా. 16.6%, అర్జెంటీనా 14.5%ఇండోనేశియా 13.0%కజఖస్తాన్ 10.9%, బ్రెజిల్ 9.1%, రష్యా 7.5%, ఆస్ట్రేలియా 6.0%, కెనడా 5.0%, కాంగో(డె.రి)  3.1%, అల్జీరియా 3.1%, చైనా 3.0%, సౌదీ అరేబియా 1.4%. ఇండియాకంటే కొద్దిగా  ముందున్నవి అతి చిన్న దేశాలైన బంగ్లాదేశ్ (59%), డెన్మార్క్(56.7%), ఉక్రెయిన్(56.2%), మొల్దోవ(55.2%) మాత్రమే. ప్రాణుల జీవనాధారానికీ పంటలు పండడానికీ భూమిమీద ఉన్న నీటివనరులేగాక యేడాది పొడవూతా కురిసే వర్షపాతంకూడా అత్యవసరం. ప్రపంచ దేశాల జాతీయ తలసరి ఆదాయం దీనిమీదే ఆధారపడివుంటుంది. ప్రపంచం మొత్తమ్మీద వైశాల్యంలో అతి పెద్దవైన డజను ప్రధాన దేశాల సాంవత్సరిక సగటు వర్షపాతం: బ్రెజిల్ 1,761, కాంగో 1,543, ఇండియా1,083 మి.మీ.తో మొదటివరసలో ఉండగా అమెరికా 715, చైనా 645, అర్జెంటీనా 591, కెనడా 537,  ఆస్ట్రేలియా 534, రష్యా 460 మి.మీ.తో రెండవవరసలోనూ, కజఖస్తాన్ 250, అల్జీరియా 89, సౌదీ అరేబియా 59 మి.మీ.తో అతితక్కువ వర్షపాతంతో అట్టడుగు స్థాయిలో ఉన్నాయి.

ఇక, ఇతర వాతావరణ అంశాల వంటిదే సూర్యరశ్మి కూడా. మానవజాతి మనుగడకూ  వృక్ష సంపద  పెరుగుదలకూ ఎండ అవసరం ఉంది. ఈ భూమిపై వృక్ష సంపద పెరుగుదల మొత్తం ఎక్కువగా సౌరశక్తిచే ప్రభావితమైనదే.  దీర్ఘ సూర్యరశ్మి గలిగిన పగళ్లతో  పంటలు    వేగంగా పెరుగుతాయి. అతి తక్కువ కాలంలో పరిపక్వతకు చేరుకుంటాయి.  ఎండ చాలా తక్కువ కాసే ప్రదేశాలలో  మొక్కలూ  జంతువులలో  వ్యాధులు అధికం. అందువలన, మొక్కలకూ అలాగే మానవ కార్యకలాపాల కోసం ఏడాది పొడవునా సూర్యరశ్మి  కొంత ఎక్కువగా అవసరం. భారత దేశమంతటా సంవత్సరంలో అధిక భాగం రోజుకు సగటున పన్నెండు గంటలపాటు ఎండకాయడం ప్రకృతి సిద్ధ వనరుల లభ్యతకు నిదర్శనం. సగటు వర్షపాతంలోనూ, సాగునేల విస్తీర్ణంలోనూ, నీటివనరులలోనూ, ఎండకాసే వ్యవధిలోనూ అన్నింటా తక్కువే వున్న    అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలు కోట్లల్లో వలసవచ్చే భారత జనాభాను ఆదరించి ఆశ్రయమివ్వగల సత్తా కలిగినవని చెప్పలేము. ఈ గణాంకాలను పరిశీలించినవారు ఎవరైనా హేతుబద్ధ తార్కిక బుద్ధితో ఆలోచించేవారు ఎవరూ మన దుకాణం కట్టేసి వలసపోదాం అనరు.

అమెరికా 1917, 1924లో తెచ్చిన నిర్బంధ వలస చట్టాలు,  అమెరికా సంయుక్తరాష్ట్రాలకు ఆసియా నుండి సాగే  వలసలను నిషేధస్థాయికి తెచ్చాయి. ఇక   భారతదేశం నుండి వలస ఇప్పటికే అతి తక్కువ స్థాయిలోకి చేరింది. ఉదా. 2013 వరకూ అమెరికాకు వలసవచ్చిన 4.5 కోట్ల విదేశీయులలో భారతీయుల శాతం 4.7 మాత్రమే. అంటే షుమారు 21 లక్షలు. అమెరికా సంయుక్తరాష్ట్రాలు భారతీయుల పట్ల చూపించే వివక్షకు తార్కాణం ఇది. మిగిలిన 4.30 కోట్లమందిలో ఎక్కువమంది ద. అమెరికా, యూరపునుండీ కాగా బహు తక్కువమంది మాత్రమే ఆసియా ఆఫ్రికానుండి. ఎంత వివక్ష! వీళ్ళా మిలియన్లకొద్దీ ఇండియన్లను ఆదరించి ఆశ్రయమిచ్చేవారు. ఇక ఆస్ట్రేలియా కెనడా  సంగతులు చెప్పనవసరమే లేదు. ఈ దేశాల వలస చట్టాలు బాహాటంగానే  ఆసియా ఆఫ్రికావారిపై నిర్బంధాలను అమలుపరుస్తున్నాయి. మరి ఈ పరిస్థితులలో ఈ అసత్య అశాస్త్రీయ ఆధారాలతో ఇంగ్లీషు మాధ్యమ ఉద్యమ ప్రచారం దేనికోసం. ఏం ఆశించి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నట్టు. ఏ లాభం ఆశించి చేస్తున్నారు.

భారత దేశానికి అనాది కాలంనుండి అనేక జాతులూ, మతాలూ ఇతర సముదాయాలవారు రావడం, వీలుంటే దోచుకుపోవడం లేదంటే ఇక్కడే తిష్టవేయడానికి ఈ దేశ సహజ సంపదల  ఆకర్షణే ప్రధాన కారణం. నేటి పేదల కడగండ్లు, ప్రకృతిక వనరులూ సహజ సంపదలూ లేకకాదు స్వార్థపరుల రాజకీయాలూ కొందరి అంతులేని ధనదాహం వలననే. ఇంగ్లీషు నేర్చుకొని సొంతదంతా వదులుకొని  పొట్టచేతబట్టుకొని వలస పొమ్మనడంకంటే ఇంటి సంపదను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అవసరం.  దీనికి ఇంగ్లీషు మాధ్యమ విద్య అవసరం లేదు. వేల యేండ్లకిందటే మనతో పుట్టి, మనమధ్య వికసించి మన జీవితంతో పెనవేసుకొని మన జీవనంలో కలగలిసి మనతో మమేకమైన తెలుగును ఒక్క కలంపోటుతో పక్కనపెట్టి ఇంగ్లీషు మాధ్యమానికి తలవూపడం అవివేకం, అనాలోచితం.

ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్లలో ఇంటర్ లో తెలుగు లేకుండా చేశాం. దీనితో, తెలుగులో చదవడం రాయడం తగ్గడంతో పిల్లలు మన నడత, నడవడిక, మనం బతుకుతున్న వైనం, మన కుటుంబ సభ్యులతో పెద్దా చిన్నా తేడాలతో మెలిగే తీరూ తిప్పలూ తెలియకుండా పోవడం మొదలైంది. తెలుగులో మన జీవన విధానాన్ని ప్రతిబింబించే రచనలను చదవడం తగ్గడంతో ఒకరితో ఒకరు మెలగడం మసులుకోవడం తెలియకుండాపోతోంది. నేడు మన కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలూ నేరాలూ, హత్యలూ ఆత్మహత్యలూ, హింసా ప్రతిహింసా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పిల్లలూ పెద్దలని తేడా లేకుండా ఓర్పును కోల్పోతున్నాం. తల్లిదండ్రులు కోప్పడితేనో మార్కులు తక్కువ వచ్చినై అనో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం  తనను కాదన్న ఆడపిల్లపై ఆమ్లదాడికి దిగడం మన సమాజంలో తలెత్తుతున్న సహన హననాన్ని తెలుపుతున్నాయి. మాతృభాషలో మానవీయ విలువలున్న సాహిత్యాన్ని చదివించాల్సిన సమయాన్ని మనం కుదించివేశాం. నిర్దిష్టమైన ఆశయాలనూ సమాజంలో ఉమ్మడి బాధ్యతలనూ పాఠ్యపుస్తకాలలో విపులంగా  చర్చించకుండా తరువాత వచ్చే దుష్పరిణామాలపై తలలుపట్టుకోవడం చేతులు కాలినతర్వాత ఆకులుపట్టుకోవడమే ఔతుంది. ఇట్లాంటి సామాజిక దుష్పరిణామాలను నివారించడానికి మాతృభాషా మాధ్యమం అత్యంత ఆవశ్యకం. పిల్లలకు బడిలో నేర్చినదానికీ ఇంట్లోనూ తన చుట్టూవున్న సమాజంలోనూ తను పాటించాల్సిన మానవీయ విలువలకు పొంతన ఉండాలి. బడిలో ఎంతసేపూ మానవ సంబంధాల బోధనను చులకనచేసి  చిన్నచూపు చూస్తూ సమాజంతో మంచిగా మెలగాలని కోరుకోవడం ఒక భ్రమే ఔతుంది. మన సమాజంలోనూ కుటుంబాలలోనూ వ్యక్తుల  హక్కులనూ సామాజిక బాధ్యతలనూ  గుర్తిస్తూ మానవీయ   విలువలను పాటించే ఓర్పునూ నేర్పునూ మాతృభాషద్వారానే నేర్పించాలి. ఇది తల్లి ఒడిలోనే మొదలౌతుంది.  మధ్యలో ఆంగ్లభాష పెత్తనం ఎందుకు?

          ఇక తెలుగువదిలి ఇంగ్లీషు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఆర్ధిక పరిస్థితులు మెరుగౌతాయి అనడం పచ్చి అబద్ధమే.   రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక 2014-15 గణాంకాల ప్రకారం భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం 17.01%, పరిశ్రమలు 30.02%, సేవలు 52.97% (నిర్మాణం, వాణిజ్య-వ్యాపారాలు, హోటళ్లూ-రెస్టారెంట్లూ, రవాణా, నిలువలూ, సమాచార ప్రసారం, సామాజిక సేవ, బీమా రంగాలు). ఈ గణాంకాలను ఎలా విశ్లేషిస్తాం.  ఉద్యోగరంగ సమాచార వ్యవస్థ: ఉద్యోగ మంత్రిత్వ శాఖవారు విడుదలచేసిన నివేదికలో భారతదేశంలో 52.85% ప్రజలు వ్యవసాయరంగంలోనూ, 24.08% సేవారంగంలోనూ, 23.07%  ఉత్పాదక, అనుత్పాదక నిర్మాణ వాణిజ్య రంగాలలోనూ ఉపాధి పొందుతున్నారు. అంటే వ్యవసాయరంగంలో తెలుగూ తదితర భారతీయభాషలనేగానీ ఇంగ్లీషు వాడరుగదా. సేవా రంగంలోనూ భారతీయ భాషలనే ఎక్కువగా వాడతాం,   ఇంగ్లీషు వాడకం తక్కువ. మిగిలిన ఉత్పాదక, అనుత్పాదక నిర్మాణ రంగాలలో ఎక్కువ శాతం భారతీయ భాషలను వాడినా చెప్పుకోదగిన స్థాయిలో ఇంగ్లీషు వాడకం ఉంది ఐతే అది పైస్థాయిలలోనే. అంటే మన స్థూలజాతీయ ఉత్పత్తికి ప్రధానాధారం భారతీయ భాషలేగానీ ఇంగ్లీషుకాదు అని తెలుస్తోందికదా. మరి మన ఉత్పాదక శక్తికి ఆలంబనగా నిలిచి దేశాభివృద్ధికి తోడ్పడే తెలుగూ తదితర భారతీయ భాషలను వదిలివేయాలనే ఆలోచనా సరళి అశాస్త్రీయంగాక ఏమౌతుంది.

          ఇక విదేశాలకు వెళ్లిన మనవారు  ప్రపంచం నలుమూలలా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నది ఎంత? స్థూల జాతీయ ఉత్పత్తికి ప్రవాస భారతీయుల వాటా 4% మాత్రమే. ఇందులోనూ తక్కువ నైపుణ్యాలు ఉన్నవారూ, అర్ధనైపుణ్యం గలవారే ఎక్కువ. మన ప్రవాస భారతీయులు ఎక్కువగా ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలోనే ఉద్యోగాలను వెతుక్కొంటున్నారు. అంటే వీరిలో ఎక్కువమందికి ఆంగ్లభాషా మాధ్యమంతో పనిలేదు. ఐతే, ఇంగ్లీషూ ఇతర విదేశీ భాషలు నేర్చుకొనే సౌకర్యం కావాలి.

తెలుగూ తదితర భారతీయ భాషల స్థానే ఇంగ్లీషును ప్రవేశపెడితే జరిగే ఘోర విధ్వంసానికి గురయ్యేది సినిమా పరిశ్రమ, ఇంకా దాని ఆధారంగా చేసుకొని నడుస్తున్న బుల్లితెర పరిశ్రమ. సంవత్సరానికి 16,250 కోట్ల వ్యాపారానికి చేరిన సినిమా పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. భారతీయ సినిమా పరిశ్రమలో ఎక్కువ సినిమాలతో, ఎక్కువ థియేటర్లతో ప్రపంచంలోనే ముందున్నది తెలుగు సినిమా. తెలుగును పక్కనబెడితే  తెలుగు సినిమా పరిశ్రమను ఘోర విధ్వంసానికి గురిచేసినట్లే. తెలుగు సినిమాను నాశనంచేసి ఇంగ్లీషు సినిమాలను తీసుకువచ్చే ప్రయత్నం వెనుక ఓ అంతర్జాతీయ కుట్ర ఉండివుండాలి. ఇది చిత్రపరిశ్రమపై ఆధారపడి జీవించే లక్షలాదిమంది జీవితాలను తొక్కివేసినట్లే. వేలాదిమంది కళాకారులూ సాంకేతికనిపుణులూ శ్రామికులూ రోడ్డునబడతారు.

          ఈ విధ్వంసం ఇక్కడితో ఆగదు. భారతీయ ముద్రణా పరిశ్రమ వ్యాపారం యేడాదికి దాదాపు 25 వేలకోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ అచ్చుయంత్రాలు ఉన్న దేశం మనది. దీనిద్వారా షుమారు 25 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ముందుముందు ప్రపంచంలోనే మొదటిస్థానానికి చేరుకోబోతున్న పరిశ్రమ ఇది. ఇక ఇంగ్లీషు మాధ్యమం వస్తే వేలాది రచయితలూ, లక్షలాది ఉద్యోగులూ పనిలేక మూలన కూర్చోవలసిందే.   అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో కుర్చొని రాసిందే అచ్చయ్యి మనముందుకు వస్తుంది. మన జన విధ్వంసానికి ఇంతకన్నా ఏంకావాలి. ఇంగ్లీషు మీడియం భారతదేశానికి అణుబాంబే. దానితో ఎన్నో దేశీయ పరిశ్రమలు మూలబడతాయి. లక్షలాదిమంది ఉద్యోగస్తులు ఉపాధికోల్పోతారు.  ఈ జీవ విధ్వంసాన్ని ఎలాగైనా ఆపాలి.

  మాధ్యమిక స్థాయి వరకూ విద్య పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉచిత విద్యావిధానంలో నడవాలి. తెలుగు మాధ్యమంలోనే ఉండాలి.  దీనివలన పసివయసులో విద్యార్థులమధ్య ప్రభుత్వ బడుల విద్యార్థులనీ కార్పోరేట్ బడుల విద్యార్థులనే భేదభావం రాదు. సమాజంలో చిన్నతనంనుండే ఏర్పడే వైరుధ్య భావాలను కొంతవరకైనా నివారించినవాళ్లం ఔతాం. జపానూ  చైనాలు ఇట్లాంటి విద్యావ్యవస్థనే నడుపుతున్నాయి.  ఒకవేళ మైనారిటీ సముదాయాలవారూ ఇతర ప్రైవేటు విద్యాసంస్థలూ ఇలాంటి బడులు నడపాలంటే ప్రభుత్వ గుర్తింపుతో నడపవచ్చు కానీ   విద్యార్థులనుండి ఎలాంటి రుసుమునూ వసూలుచేయరాదు.  ఇంగ్లీషూ తదితర భాషలు ప్రత్యేక విషయాలుగా మాత్రమే ఉండాలి. ప్రతి స్కూలులోనూ అది ఉన్న స్థానిక జనాభా ప్రాతిపదికన మాత్రమే తెలుగేతర మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి.     మనకందరికీ పుట్టుకతో వచ్చి తల్లి ఒడిలోనూ బడిలోనూ మనతో ఉండి మనకు ఇంత మానసిక ధైర్యాన్ని కలిగించి నేర్చినదాన్ని రాయడానికీ చెప్పడానికి  వీలు కలిగేది తెలుగులోనే. మాతృభాషలో భావప్రకటన స్వేచ్ఛకు సంకేతం.  కొత్త విషయాల ఆవిష్కరణకు మాతృభాష చిరునామా.


గారపాటి ఉమామహేశ్వరరావు, 9866128846

భాషాశాస్త్ర ఆచార్యులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం

No comments:

Post a Comment